Peddapalli Collector is organizing the wedding of an orphan girl.
అనాథ యువతికి అన్నీ తానై.. పెళ్లి జరిపిస్తున్న పెద్దపల్లి కలెక్టర్.
peddapalli collector sri harsha:పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తన నిర్ణయాలు, చర్యల ద్వారా ఎందరికో ఆదర్శంగా నిలిచే శ్రీహర్ష.. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. అనాథ యువతి పెళ్లికి పెద్దగా మారారు. కలెక్టర్ ప్రాంగణంలోనే పెళ్లి చేేసేందుకు నిర్ణయించిన శ్రీహర్ష.. వివాహానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని తెలిపారు. అధికారుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరగనున్న ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..
పెళ్లి అంటే యువతీయువకులకు ఎన్నో కలలు ఉంటాయి. ఆడపిల్లలకయితే పెళ్లి అంటే కలలతో పాటుగా కొన్ని భయాలు కూడా ఉంటాయి. ఎలాంటి వ్యక్తి భర్తగా వస్తాడో.. మెట్టినింటి వాళ్లతో తన బంధం ఎలా ఉంటుందో.. అసలు తాను ఈ బాధ్యతను సరిగా నిర్వర్తించగలదా లేదా అనే అనుమానాలు. కానీ వాటన్నింటికి పరిష్కారం తల్లిదండ్రులు. మెట్టినింట్లో ఏ సమస్య వచ్చిన కన్నవారు తోడుగా ఉంటారనే ధైర్యంతో వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుంది అమ్మాయి. మరి అమ్మానాన్న లేని వాళ్ల పరిస్థితి..
మూడు పూటలా తిండి, ఉండటానికి నీడ దొరికితే చాలనుకునే అనాథలు పెళ్లి గురించి పెద్దగా కలలు కనరు. తోడు దొరికితే చాలనుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి కూడా అలానే అనుకుంది. కానీ కలెక్టర్ రూపంలో అనుకోని అదృష్టం పలకరించింది. అనాథ యువతివివాహం గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్.. మంచి మనసుతో స్పందించి.. అన్నీ తానై ఆ పెళ్లి వేడుక నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. పెళ్లి ఖర్చంతా తానే పెట్టుకుంటానని ప్రకటించారు. ఈ వివాహ వేడుక గురించి తెలిసిన .. అన్నీ ఉన్నవాల్ల పెళ్లి వేడుక కూడా ఇంత ఘనంగా జరిగదు కదా అని ప్రశంసిస్తున్నారు. ఆ వివరాలు..
మరి ఇంత మంచి పనికి శ్రీకారం చుట్టింది ఎవరంటే.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష. ఇప్పటికే పలు సందర్బాల్లో ఆయన పేరు వార్తల్లోకి వచ్చింది. గతంలో తన భార్యకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ఇప్పుడు అనాథ బాలికకు అన్నీ తానై వివాహం చేసేందుకు ముందుకు వచ్చి.. మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ఆయన చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..
మానస అనే యువతి.. తల్లిదండ్రులు లేకపోవడంతో.. గత 16ఏళ్ల నుంచిపెద్దపల్లి జిల్లా రామగుండంలోని తబిత ఆశ్రమంలో జీవిస్తుంది. ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది. తల్లిదండ్రులు లేక అనాథగా మారిన మానసకు పెళ్లీడు వచ్చింది. దాంతో ఆశ్రమ నిర్వాహకులు ఆమెకు జనగామ జిల్లాకు చెందిన రాజేశ్ అనే యువకుడితో వివాహం నిశ్చయించారు. కానీ మానసకు తల్లిదండ్రులు లేకపోవడంతో.. పెళ్లి క్రతువు ఎవరు చేస్తారనే ప్రశ్న తలెత్తింది.
ఈ విషయం జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాలరావుకి తెలిసింది. ఆయన ఈ విషయాన్ని కలెక్టర్ శ్రీహర్ష దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న శ్రీహర్ష మనసు భారమైంది. పెళ్లి అంటే అమ్మాయికి ఎన్ని కలలు, ఆశలుంటాయి.పాపం తల్లిదండ్రులు లేని మానసకు అవన్ని చేయడానికి ఎవరు లేరని తెలిసి బాధపడ్డారు. అంతలోనే ఆయనలోని మానవతా వాది బయటకు వచ్చారు. ఎవరూ లేరని ఎందుకు అనుకోవాలి.. తానే అన్నలా మారి తన చేతుల మీదుగా మానస పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అనుకున్నారు.
అలానే పెళ్లికి అయ్యే మొత్తాన్ని తానే భరిస్తానని తెలిపారు శ్రీహర్ష. అంతేకాక, పెళ్లిని అధికారికంగా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఆలయంలో జరిపించాలని నిర్ణయించారు. కలెక్టర్ నిర్ణయానికి మిగతా సిబ్బంది కూడా మద్దతు తెలిపారు. జిల్లా అధికారులు, సంక్షేమ శాఖ సభ్యుల సమక్షంలో మానస వివాహం నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక వివాహ పత్రికలో కూడా పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష పేరును ప్రింట్ చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో జరగబోతున్న ఈ వివాహానికి జిల్లా అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, ఇతర అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకాబోతున్నారు.
నా జీవితంలో మరిచిపోలేని ఘట్టం
తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథగా ఆశ్రమంలో పెరిగిన తన పెళ్లి ఇంత ఘనంగా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదంటుంది మానస. కలెక్టర్ పెళ్లిపెద్దగా మారి తన వివాన్ని జరిపించడానికి ముందుకు రావడంతో మానస సంతోషానికి అవధులు లేకుండా పోతుంది. తల్లిదండ్రులు ఉన్నవాళ్లకే ఇంత గౌరవంగా పెళ్లి జరగడం లేదు.. అలాంటిది అనాథ అయిన తన పెళ్లిని ఇంత ఘనంగా జరుపుతున్న కలెక్టర్ శ్రీహర్షకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నది. ఈ ఆశ్రమం తనకు కుటుంబం అని.. అధికారులు తనకు తల్లీదండ్రులు, బంధుమిత్రులుగా మారారని సంబరపడుతుంది.తన జీవితంలో ఇది మరరిచిపోలేని ఘట్టమని చెబుతూ భావోద్వేగానికి గురయ్యింది మానస.
అనాథకు అన్నీ తానై వివాహం చేయడానకి ముందుకు వచ్చిన కలెక్టర్పై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అధికారులు, పాలకులు ఇలా మానవతాదృక్పథాన్ని కలిగి ఉంటే ఎందరికో మంచి జరగుతుందని.. సమాజంలో కూడా మార్పు వస్తుందని అంటున్నారు.