86 percent indian students skipped canada education amid diplomatic row
అమ్మో కెనడా...వద్దే వద్దంటున్న భారతీయ విద్యార్ధులు- ఏకంగా 86 శాతం డ్రాప్.. !
ఒకప్పుడు భారత్ నుంచి కెనడా వెళ్లి చదువుకోవడమంటే అదో గౌరవం, ప్రతిష్టాత్మకంగా ఉండేది. కానీ మారుతున్న పరిస్ధితుల్లో భారత్-కెనడా మధ్య సిక్కుల విషయంలో నెలకొన్న దౌత్య వివాదాలు ఇప్పుడు ఆ దేశానికి వెళ్లాలనుకునే మన విద్యార్ధులకు శాపంగా మారుతున్నాయి. ఈ వివాదాల కారణంగా కెనడా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్ధుల సంఖ్య భారీగా పడిపోతోంది. ముఖ్యంగా సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య తర్వాత కెనడాలో నెలకొన్న పరిణామాలు భారతీయుల్ని కలవరపెడుతున్నాయి.
రెండేళ్ల క్రితం భారత్ నుంచి ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్లిన భారతీయుల సంఖ్య 2.25 లక్షలుగా ఉండేది. ఇది అంతర్జాతీయంగా కెనడాకు వచ్చిన విద్యార్ధుల జనాభాలో ఇది 41 శాతం. కానీ గతేడాది సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో పరిస్ధితి ఒక్కసారిగా తలకిందులైంది. నిజ్జార్ ను బ్రిటీష్ కొలంబియాలో భారతీయ ఏజెంట్లే హతమార్చారంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ప్రకటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇరుదేశాలూ తమ దౌత్య వేతల్ని బహిష్కరించుకున్నాయి. ఆ తర్వాత భారతీయ విద్యార్ధులకు ఇచ్చే పర్మిట్ల సంఖ్యను కెనడా తగ్గించేసింది.
దీంతో భారత్ నుంచి కెనడాకు వచ్చే విద్యార్ధుల సంఖ్య ఏకంగా 86 శాతం పడిపోయినట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు నిర్దారించాయి. భారత్-కెనడా ఉద్రిక్తతల కారణంగా గతేడాది నాలుగో క్వార్టర్ లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 86 శాతం మంది భారతీయ విద్యార్ధుల రాక తగ్గిపోయినట్లు నిర్ధారణ అయింది. అంతకు ముందు ఏడాది అదే సమయంలో లక్షా 8 వేల మంది భారతీయ విద్యార్ధులు కెనడాకు వస్తే గతేడాది మాత్రం కేవలం 15 వేల మంది మాత్రమే వచ్చారు. అంటే కెనడా వెళ్లేందుకు భారతీయ విద్యార్ధులు ఎంత భయపడుతున్నారో, పర్మిట్ల ప్రభావం వారిపై ఎంత ఉందో ఇట్టే అర్ధమవుతుంద
కెనడాకు భారతీయ విద్యార్దుల రాక పడిపోవడంతో ఆ దేశంలోని యూనివర్శిటీల ఆదాయంపైనా ఆ మేరకు ప్రభావం పడింది. అయితే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గితే విద్యార్ధులకు జారీ చేసే పర్మిట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఈ ఏడాది అయినా విద్యార్ధులు కెనడా వెళ్లేందుకు ఆసక్తి చూపుతారా లేదా అన్నది ఇరుదేశాల మధ్య సంబంధాలపై ఆధారపడనుంది.