Taking loans on online apps, do this to avoid getting cheated..
ఆన్లైన్ యాప్లలో లోన్స్ తీసుకుంటున్నారా, మీరు మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..
ఆన్లైన్ లోన్ కంపెనీల స్వీయ నియంత్రణ సంస్థ 'ఫిన్టెక్ అసోసియేషన్ ఫర్ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్' ఇటీవల విడుదల చేసిన నివేదిక డిజిటల్ లోన్లకు ఇప్పుడు ఎంత ఆదరణ ఉందో తెలియజేస్తోంది.
నివేదిక ఏం చెబుతోంది?
గత ఆర్థిక సంవత్సరంలో, ఫిన్టెక్ కంపెనీలుగా పిలిచే ఆన్లైన్ ఫైనాన్స్ కంపెనీలు రూ.1,46,517 కోట్ల విలువైన డిజిటల్ రుణాలిచ్చాయి. ఇది 2022-23లో ఇచ్చిన రుణాల సంఖ్య కంటే 35 శాతం ఎక్కువ. అలాగే, గత ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన మొత్తం రుణాల విలువ కూడా 49 శాతం పెరిగింది.
గత ఏడాది ఇచ్చిన డిజిటల్ రుణాల్లో 70 శాతం రుణాలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ)గా నమోదైన 28 సంస్థలు ఇచ్చినవే.
డిజిటల్ క్రెడిట్ అంటే ఏంటి?
అత్యవసర కొనుగోళ్లు, మెడికల్ ఎమర్జెన్సీ, ప్రయాణాలు, ఇంటి అద్దెలు, కిరాణ సరుకులు, పెళ్లి ఖర్చులు వంటి వాటి కోసం డిజిటల్ లోన్ పొందవచ్చు.
ఈ రుణాలకు ఇంత ఆదరణ ఎందుకంటే, బ్యాంకుకు వెళ్లే పనిలేకుండా, లెక్కకు మించి సంతకాలు పెట్టాల్సిన అవసరం లేకుండా, కేవలం మీ స్మార్ట్ఫోన్ ద్వారా కొన్ని గంటల్లోనే ఈ రుణాలు పొందగలగడమే అందుకు కారణం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం నడిచే బ్యాంకులు, లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఈ డిజిటల్ రుణాలను అందిస్తాయి.
ఒకవైపు పెరుగుతున్న స్మార్ట్ఫోన్ల వినియోగం, మరోవైపు కరోనా మహమ్మారి కారణంగా షట్డౌన్. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు నగదు అవసరమై, డిజిటల్ రుణాల రూపంలో తక్షణ రుణాలు తీసుకున్నారు. డిజిటల రుణాల పెరుగుదలకు ఇది ప్రధాన కారణం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, 2017 నాటికి మొత్తం రుణాల్లో బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థల వాటా 6.3 శాతం ఉండగా, 2020 నాటికి అది 30 శాతానికి పెరిగింది.
డిజిటల్ రుణాలు ఎక్కువ ఎవరు తీసుకుంటున్నారు?
ముఖ్యంగా యువత, డిజిటల్ ప్రపంచంలో మునిగితేలుతూ ఎక్కువ వస్తువులు కొనుగోలు చేయాలనే కోరిక ఉన్నవారితో పాటు, మొదటిసారి రుణాలు తీసుకునేవారు డిజిటల్ లోన్ల వైపు మొగ్గు చూపుతున్నారని ఆర్బీఐ నివేదిక చెబుతోంది.
ఏయే డాక్యుమెంట్లు అవసరం?
చిరునామా రుజువు కోసం ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్తో పాటు సిబిల్ స్కోర్ 650కి పైగా ఉండాలి. ఆ తర్వాత ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి, తక్షణమే రుణం పొందవచ్చు.
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, రుణంగా తీసుకున్న మొత్తాన్ని నేరుగా రుణం తీసుకుంటున్న వారి బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలి. మరొకరి ఖాతాలో నగదు జమ చేసేందుకు అంగీకరించొద్దని వినియోగదారులకు ఆర్బీఐ సూచించింది.
అయితే, కొన్ని నకిలీ యాప్లు తగిన పత్రాలు లేకుండా రుణాలు అందిస్తున్నాయి. కస్టమర్ల అవసరాన్ని అసరాగా చేసుకుని, థర్డ్ పార్టీ ఖాతాల్లో రుణ మొత్తాన్ని జమ చేస్తారు.
నకిలీ యాప్లను గుర్తించడమెలా?
రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ అధ్యయనం ప్రకారం, దేశంలోని 1,100 లోన్ యాప్లలో 600 యాప్లు నకిలీవి. లోన్ ప్రాసెస్ చేసే వారి సంఖ్య పెరుగుతుండడంతో, కస్టమర్లు నకిలీ యాప్లను గుర్తించడం కష్టంగా మారింది.
అలాగే, నకిలీ యాప్లు కూడా పెరిగాయి. ఒరిజినల్ యాప్లాగే ఉండే ఫేక్ యాప్లపై జాగ్రత్త అవసరం.
ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో 81 డిజిటల్ లోన్ యాప్లు ఉన్నాయి. కానీ, గూగుల్లో సెర్చ్ చేస్తే వేల సంఖ్యలో యాప్లు కనిపిస్తాయి. యాప్ స్టోర్కి ఉండే నిబంధనల కారణంగా, అందులో నకిలీ యాప్ల అవకాశం తక్కువ.
అందువల్ల గూగుల్ సెర్చ్, వాట్సాప్, మెసేజ్, టెలిగ్రామ్ యాప్, సోషల్ మీడియాలో కంటే.. నేరుగా ప్లే స్టోర్ నుంచి లోన్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవడం ఉత్తమం.
కొన్ని నకిలీ యాప్లు రుణాలు ఇస్తామంటూ అధిక ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. కానీ, రుణాలు మాత్రం ఇవ్వడం లేదు.
అలాగే కొందరు అధిక వడ్డీలు వసూలు చేయడంతో పాటు, వినియోగదారుల ఫోటోలు, వారి కాంటాక్ట్ లిస్టులోని నంబర్లను కూడా దుర్వినియోగం చేస్తారు. అంతేకాకుండా రుణం తిరిగి వసూలు చేసుకునేందుకు అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారు.
''రుణం తీసుకోవడానికి కొన్ని నిర్దిష్ట విధానాలు ఉన్నాయి. బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలంటే ఆస్తి, నగలను తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. కానీ, కొన్ని యాప్లు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.
బ్యాంకుల నుంచి లోన్ లేదా క్రెడిట్ కార్డ్ పొందలేని వారు కూడా యాప్లలో డిజిటల్ లోన్లు పొందవచ్చు. తాకట్టు లేకుండా రుణం తీసుకోవడమనేది మిమ్మల్ని మీరు తాకట్టు పెట్టడం లాంటిది. మీ ఫోటో, కుటుంబ వివరాలు, ఫోన్ నంబర్లు, మీ గోప్యత వంటి వాటిపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది''అని 'రుణం' అనే పుస్తకం రాసిన ఆర్థిక సలహాదారు చొక్కలింగం పళనియప్పన్ చెప్పారు.
''యాప్ల ద్వారా సులభంగా వచ్చే రుణాలు ప్రమాదకరం. కొన్ని కంపెనీలు అధిక వడ్డీలు వసూలు చేయడమే కాకుండా రుణ మొత్తం చెల్లించిన తర్వాత కూడా కస్టమర్లను వదలడం లేదు. వీలైనంత వరకూ, క్రెడిట్ కార్డులు వాడుకోవడం ఉత్తమం'' అని ఆయన చెప్పారు.
మీరు డిజిటల్ లోన్ యాప్లను డౌన్లోడ్ చేసే ముందు నకిలీ యాప్లను నివారించడం కోసం యాప్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి.
రుణాలకు దరఖాస్తు చేసే ముందు ఈ వివరాలను తప్పనిసరిగా చెక్ చేయాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
- ఆ కంపెనీకి వెబ్సైట్ ఉందా?
- ఆ యాప్ వెనుక ఏదైనా న్యాయ సంస్థ ఉందా?
- ప్లేస్టోర్లో యాప్ డౌన్లోడ్ కౌంట్, రివ్యూలు ఎలా ఉన్నాయి? అనే వివరాలు చెక్ చేయడం ఉత్తమం.
బ్యాంకు లోన్ వర్సెస్ డిజిటల్ లోన్:
పర్సనల్ లోన్ అనేది బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థలు అందించే మొదటి రకం రుణం. ఇంకా ఇతర రుణాలు కూడా ఉంటాయి. ఈ ఇతర రుణాలను ఎక్కువగా వస్తువుల కొనుగోలుకి వినియోగిస్తున్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది.
బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల్లో 87 శాతం రుణాలకు తిరిగి చెల్లించే గడువు ఏడాది కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ, డిజిటల్ రుణాల్లో కేవలం 23 శాతం మాత్రమే ఏడాది కంటే ఎక్కువ గడువు ఉన్నాయి. డిజిటల్ లోన్లు చాలావరకూ 30 రోజుల్లోపు చెల్లించే స్వల్పకాలిక రుణాలు.
ఆర్బీఐ నివేదికలోని డేటాను పరిశీలిస్తే, డిజిటల్ రుణాలు ఎక్కువగా వస్తువుల కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నాయని, వాటి వడ్డీ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతుంది.
డేటా చౌర్యం గురించి తెలుసుకోవడమెలా?
డిజిటల్ రుణాలిచ్చే కంపెనీలు వ్యక్తిగత సమాచారంతో సహా చాలా డేటాను సేకరిస్తాయి.
కస్టమర్ ఎక్కువగా దేనికి ఖర్చు చేస్తారు, సోషల్ మీడియా వినియోగం వంటి సమాచారాన్ని కూడా కంపెనీలు ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.
ఇలాంటి యాప్లు, సైట్ల 'టర్మ్స్ అండ్ కండీషన్స్' ఆమోదించేప్పుడు రహస్యంగా సమాచారం సేకరించే సదరు సంస్థల విధానాల గురించి కస్టమర్లు తెలుసుకోలేరు.
వర్కింగ్ గ్రూప్ అధ్యయనం ప్రకారం, యాప్లు రుణాలు మంజూరు చేసేప్పుడు 30 శాతం కంపెనీలు కస్టమర్ల లొకేషన్, 30 శాతం కంపెనీలు కెమెరా యాక్సెస్, 21 శాతం మంది ఫోన్లోని కాంటాక్ట్ నంబర్ల యాక్సెస్, 11 శాతం కంపెనీలు ఫోన్ కాల్స్ చేయడానికి, 11 శాతం కంపెనీలు ఫోన్ కాల్స్ రికార్డ్ చేయడానికి అనుమతులు అడుగుతున్నాయి.
డిజిటల్ రుణాలు చాలావరకూ కాగిత రహిత ప్రక్రియలో మంజూరు చేసేవి కాబట్టి, ఈ - కేవైసీ ప్రక్రియను నిర్ధారించేందుకు కెమెరా యాక్సెస్, అప్పు తీసుకునే వారి ప్రాంతాన్ని నిర్ధారించుకోవడానికి లొకేషన యాక్సెస్ అవసరం. అవి మినహా మిగిలిన అనుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్బీఐ చెబుతోంది.
ఇది రుణగ్రహీతల నుంచి అదనపు డేటా సేకరించడాన్ని నిరోధించడంతో పాటు భవిష్యత్తులో పరువు నష్టానికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా నిరోధిస్తుంది.
