(May 7)On the birth anniversary of Nobel laureate Rabindranath Tagore...

 On the birth anniversary of Nobel laureate Rabindranath Tagore...

నోబెల్ పురస్కార గ్రహీత - విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా...

On the birth anniversary of Nobel laureate Rabindranath Tagore...

(రవీంద్రనాథ్ ఠాగూర్ - విశ్వమానవతా వికాసానికి కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి)

రవీంద్రుడు కేవలం కవి మాత్రమే కాదు. ఆయనో సంగీతవేత్త, అంతకుమించి గొప్ప మానవతావాది. కాబట్టే ఆయన కవిత్వ ప్రాసంగికత నేటికి సజీవంగా విరాజిల్లుతోంది.

ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో అక్కడ దేశాన్ని నిలుపు

ఎక్కడ జ్ఞానం విరాజిల్లుతుందో అక్కడ దేశాన్ని నిలుపు.

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 'గీతాంజలి'లోని వాక్యాలివి. కవిత్వమనే ఎల్లలు లేని హృదయభాషతో ఒక దార్శనికుడిలా నిలబడ్డవాడు ఠాగూర్. యూరోపియన్ ప్రపంచానికి ఆవల ఆ అవార్డును సొంతం చేసుకున్న మొట్టమొదటి నాన్ యూరోపియన్ కూడా ఆయనే.

బాల్యం :

 ఒకప్పటి వంగదేశం(వంగదేశం, బీహారు, జార్ఖండ్, మరియు ఒరిస్సాలతో కూడిన ప్రాంతం)లో 1861, మే7వ తేదీన ఆయన జన్మించారు. రవీంద్రుడు కేవలం కవి మాత్రమే కాదు.. ఆయనో సంగీతవేత్త, అంతకుమించి గొప్ప మానవతావాది. కాబట్టే ఆయన కవిత్వ ప్రాసంగికత నేటికి సజీవంగా విరాజిల్లుతోంది.

రవీంద్రుని బాల్యం చాలా చోద్యంగా గడిచింది. ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆవలిస్తూ కునికిపాట్లు పడుతూ చదివేవాడు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి పోయి ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ పరవశించవాడు. కథలంటే చెవి కోసుకునే రవీంద్రుడు సామాన్య దుస్తులతో, నిరాడంబరంగా పెరిగాడు. బాల్యంలో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండవలసి రావటంతో ఆయనకు బయటి ప్రపంచం అద్భుతంగా తోచేది. ప్రపంచమొక రహస్యమనీ, ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనీ కుతూహలపడేవాడు.

ఇంటి దగ్గరే విద్య :

పాఠశాలకు వెళ్లడానికి ఇష్టపడని ఠాగూర్ ఇంటి దగ్గరే విద్యను అభ్యసించారు. ఉదయం గణితం, చరిత్ర, భూగోళ పాఠాలను, సాయంత్రం చిత్రలేఖనం, ఆటలు, ఇంగ్లీషును అభ్యసించేవారు. ఆదివారాలలో సంగీత, భౌతిక శాస్త్రం ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం నేర్చుకొనేవారు.

8 ఏళ్ళకే ఫ్రెంచి కవితకి అనువాదం :

 బెంగాలీతోపాటు ఆంగ్ల భాషల్లోనూ పట్టు సంపాదించిన రవీంద్రుడు కాళిదాసు, షేక్‌స్పియర్ రచనలను ఎక్కువ ఇష్టంగా చదివేవారు. సాహిత్యానికీ, బహుభాషా పాండిత్యానికీ, లలితకళలకూ, ఆధ్యాత్మిక చింతనకీ ఆలవాలమైన ఠాగూర్‌ కుటుంబంలో పుట్టిన రవీంద్రుడు 8 ఏళ్ళ వయస్సులోనే ఒక ఫ్రెంచి కవితకి అనువాదం చేశాడు.

రవీంద్రనాథ్ ఠాగూర్ 8 సంవత్సరాల వయసులోనే పద్యాలు రాయడం మొదలుపెట్టాడట. ఆయన రాసిన మొట్టమొదటి పద్యం ‘సంపుటి భానుసింహ‘. అయితే దీన్ని బెంగాలీ పండితులు ఆమోదించలేదట.

(రవీంద్రనాథ్ ఠాగూర్ ముత్తాత జైరామ్ ఠాగూర్ 18వ శతాబ్ధంలో ఈస్టిండియా కంపెనీలో రెవెన్యూ కలెక్టర్‌గా పనిచేశారు. రవీంద్రనాథ్ తాత ద్వారకానాథ్ ఠాగూర్ 19వ శతాబ్ధం ప్రారంభంలో కలకత్తాలో ప్రముఖ వ్యాపారవేత్తగా ప్రాచుర్యం పొందారు. అప్పట్లో కలకత్తా నగరం ఈస్టిండియా కంపెనీకి రాజధానిగా ఉండేది. ఆయన చాలా ధనవంతుడని, బ్రిటిషర్లు, ఆంగ్లో-ఇండియన్లతో ఆయనకు చాలా మంచి సంబంధాలు ఉండేవని, బ్రిటన్ రాణి విక్టోరియాతో కలసి భోజనం కూడా చేశారని సెయింట్ ఆండ్రూస్ యూనివర్శిటీలో ఆధునిక చరిత్ర విభాగం లెక్చరర్‌ చంద్రికా కౌల్  చెప్పారు. ఈస్టిండియా కంపెనీ భారతదేశస్థులకు కల్పించిన వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకుని, లబ్ధి పొందిన వారిలో ఆయన కూడా ఒకరని ఆమె తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటి ఆంగ్లో-ఇండియన్ కంపెనీ 'ఠాగూర్ కార్స్ అండ్ సన్స్'ను ఏర్పాటు చేసింది కూడా ఆయనేనని వెల్లడించారు.

ఉన్నత విద్య-సాహిత్యంపై మరింత అభిరుచి :

ఉన్నత విద్య కోసం ఇంగ్లాండుకు వెళ్లిన రవీంద్రుడు ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు విని ఆంగ్ల సాహిత్యంపై మరింత అభిరుచి పెంచుకున్నారు. సాహితీవేత్తల ప్రసంగాలు విని వారితో సంభాషించి నాటకాలు, సంగీత కచేరీలకు హాజరై ఆంగ్ల సంస్కృతీ సంప్రదాయాలను ఆకళింప జేసుకున్నారు. అక్కడ తన అనుభవాలను స్నేహితుడు భారతికి లేఖలుగా రాసేవాడు. ఇంగ్లండులో ఉండగానే భగ్న హృదయం అనే కావ్యాన్ని విశ్వకవి రచించాడు. విర్గరేర్ స్వప్న బంగ, సంగీత ప్రభాత అనే భక్తి గీతాలను కూడా రాశారు.

గీతాంజలి :

రవీంద్రుని రచనల్లో గీతాంజలి గొప్పది. బెంగాలీ భాషలో రచించిన భక్తి గీతాలను గీతాంజలి పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. అనంతరం దీన్ని అనేక ప్రపంచ భాషలలోకి తర్జుమా చేశారు. ప్రపంచ సాహిత్యంలో ఇది ఓ గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశ నిస్పృహలు, సకల సృష్టిని ప్రేమభావంతో చూసి శ్రమ గొప్పదనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. ఈ రచనకే 1913 సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది. అంతేకాదు నోబెల్ పొందిన తొలి భారతీయుడిగానే కాదు ఆసియాలోనే తొలి వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.

శాంతినికేతన్‌ :

రవీంద్రుడు కేవలం రచయితగానే కాదు, చిన్నారుల హృదయాలను వికసింపజేసే ప్రాచీన గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఐదుగురు విద్యార్థులతో ఆరంభించిన విశ్వభారతి క్రమంగా విస్తరించింది. ఉపాధ్యాయుల ఇళ్లలో విద్యార్థులు భోజనం చేసేవారు. ప్రాతఃకాలంలో నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని, తమ గదులను తామే శుభ్రంచేసి స్నానం చేయడం, ప్రార్థనలు చేయడం, నియమిత వేళలలో నిద్ర పోవడం వారి దినచర్య. ఆరోగ్యం, పరిశుభ్రత, వాక్కు శుద్ధి, పెద్దలను, గురువులను గౌరవించడం ఇక్కడ నేర్పేవారు. 1919లో కళా‌భవన్‌ను స్థాపించి విద్యార్థులకు విభిన్న కళలను నేర్పించేవారు.

గ్రామాభ్యుదయం :

గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని భావించిన రవీంద్రుడు శ్రీనికేతాన్ని నెలకొల్పి, గ్రామ పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. మొదట వాల్మీకి ప్రతిభ అనే నాటకాన్ని రచించిన విశ్వకవి, తరువాత అనేక నాటకాలు రాశారు. రవీంద్రుడి కలం నుంచి జాలువారిన చిత్రాంగద నాటకం ఆయనకు మంచిపేరు తెచ్చింది. ప్రకృతి - ప్రతీక అనే నాటకంలో ప్రపంచాన్ని విడిచి పెట్టిన సన్యాసి కథను వర్ణించారు. కచదేవయాని, విసర్జన, శరదోత్సవ్, ముక్తధార, నటిర్‌పూజ మొదలగు అనేక నాటకాలను విశ్వకరి రచించాడు. మతాలు వేరైనా పరస్పర స్నేహంతో కలసి మెలసి ఉండాలనే సాంఘిక ప్రయోజనం, సందేశ మిళితమైన 'గోరా' నవల రవీంద్రుని కీర్తిని మరింత ఇనుమడింపజేసింది.

కబీగురు, బిస్వాకాబీ :

ప్రజలు తరచుగా ఆయన కోసం గురుదేవ్ అనే పదాన్ని ఉపయోగించటానికి ఇష్టపడతారు. రవీంద్రనాథ్ ఠాగూర్‌ను కబీగురు మరియు బిస్వాకాబీ అని కూడా పిలుస్తారు.

ఠాగూర్ -ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ :

ఠాగూర్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌తో మంచి బంధాన్ని పంచుకున్నారని చాలా కొద్ది మందికి తెలుసు. ఐన్‌స్టీన్‌తో తన తొలి సమావేశం తరువాత, ఠాగూర్ ఇలా వ్రాశాడు, “అతని గురించి గట్టిగా ఏమీ లేదు- మేధోపరమైన ఒంటరితనం లేదు. అతను మానవ సంబంధానికి విలువనిచ్చే వ్యక్తి అనిపించింది మరియు అతను నాకు నిజమైన ఆసక్తి మరియు అవగాహన చూపించాడు. 

రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా జాతీయ గీతాన్ని స్వరపరిచారు, ప్రతి కోణంలో బహుముఖ ప్రజ్ఞాశాలి. అతను ఆ గొప్ప వ్యక్తులలో ఒకడు, అతని సమయానికి ముందు, మరియు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌తో అతని సమావేశం సైన్స్ మరియు ఆధ్యాత్మికత మధ్య ఘర్షణగా పరిగణించబడుతుంది.

స్వాతంత్ర్య ఉద్యమంలో :

రవీంద్రుడి ముందు నుంచి జాతీయభావం ఎక్కువ. హిందూ మేళాలో దేశభక్తి గీతాలను పాడుతూ జాతీభావాలను ప్రచారం చేశారు. పృథ్వీరాజ్ పరాజయం గురించి ప్రబోధాత్మక పద్య నాటకాన్ని రచించాడు. బాల గంగాధర్ తిలక్‌ను బ్రిటీష్ ప్రభుత్వం నిర్భంధించినపుడు రవీంద్రుడు తీవ్రంగా విమర్శించాడు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, జాతీయ నిధికి విరాళాలు సేకరించారు. ఇక,1896లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరాన్ని గీతాన్ని తొలిసారి ఆలపించాడు.

ఠాగూర్ తన రచనలలో చాలా వాటికి స్వయంగా ఆంగ్లానువాదాలు చేశారు. నోబెల్ బహుమతి అందుకున్న అనంతరం బ్రిటన్ మహారాణి ఠాగూర్ కు ‘నైట్‘ బిరుదు ప్రదానం చేశారు. అయితే జలియన్ వాలా బాగ్ దుర్ఘటనలో బ్రిటీష్ సైన్యం భారతీయులను హతమార్చిన సంఘటన ఆయనను తీవ్రంగా కలచివేసింది. దీంతో ఆ బిరుదును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.

గీతాంజలి‘, గోరా, ఘరే బైరే మొదలైన రచనలన్నీ సహజత్వం ఉట్టిపడేలా సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యేలా వాడుక భాషలో, సరళమైన శబ్దాలతో ఉండేలా, దేశభక్తిని, విశ్వమానవ సౌభ్రాతత్వం చాటేలా రెండు గీతాలను భారతదేశం(జనగణమన), బంగ్లాదేశ్ (అమార సోనార్ బంగ్ల) జాతీయ గీతాలను రచించారు. ఈయన కేవలం గీత రచయిత మాత్రమే కాదు.. నాటక రచయిత, నాటక కర్త, వక్త, వ్యాఖ్యతగా బహుముఖ ప్రజ్ణాశాలిగా ప్రసిద్ధి చెందాడు. వీటితో పాటు ప్రపంచ ప్రజలందరినీ ఉత్తేజపరిచే సందేశాన్నిచ్చిన విశ్వకవి 1941వ సంవత్సరంలో ఆగస్టు 7వ తేదీన తుదిశ్వాస విడిచారు.

"ఎక్కడమనస్సు నిర్భయంగావుంటుందో,

ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో,

ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో,

ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవదో,

ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో,

ఎక్కడ విరామమైన అన్వేషణ, పరిపూర్ణత వైపు చేతులుచాస్తుందో,

ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలోఇంకిపోదో,

తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో...

ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ! నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు"

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.