(August 3)Man of the people - Social activist - Eddula Eswara Reddy (1915 - 1986)

 Man of the people - Social activist - Eddula Eswara Reddy (1915 - 1986)

ప్రజల మనిషి - సామాజిక ఉద్యమకారుడు - ఎద్దుల ఈశ్వర రెడ్డి (1915 - 1986)

Man of the people - Social activist - Eddula Eswara Reddy (1915 - 1986)

 //వివరాల్లోకి వెళ్తే....//

కడప జిల్లా , జమ్మలమడుగు నియోజకవర్గం, పెద్దముడియం మండలం,పెద్దపసపుల గ్రామంలో,   1915లో ఈశ్వర్ రెడ్డి  జన్మించారు. వీరి తండ్రి ఎద్దుల చిన్న వెంకట సుబ్బారెడ్డి, తల్లి మల్లమ్మ.

600 ఎకరాల భూమి, 12 కాండ్ల ఎద్దులున్న పేరెన్నికయిన  భూస్వామ్య కుటుంబం వీరిది.

నందలూరులో SLC ( స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్) వరకు చదివి, అనంతపురంలో బిఎ పూర్తి చేశాడు. కళాశాల రోజుల్లో స్వామి వివేకానందుడి ఆలోచనలతో ప్రభావితుడయ్యాడు.  1936 లో డిగ్రీ తర్వాత స్వగ్రామం చేరుకొని మిత్రులతో కలిసి

"మిత్రమండలి"  ఏర్పాటు సంస్థ చేశాడు. ఈ సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాడు 

// రాజకీయాల్లో //

కాంగ్రెస్ పార్టీలో : 

భారత స్వాతంత్రం కోసం జరుగుతున్న పోరాటాలు, బ్రిటిష్ దొరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న పాత్ర, దేశంలో అల్లకల్లోల పరిస్థితులు, వీటన్నిటి నేపథ్యంలో   తన వ్యక్తిగత పోరాటంతో కాకుండా రాజకీయ పోరాటంతో  ముందుకు నడవాలని సంకల్పిస్తూ.... తన స్నేహితులైన  పి ఆర్ సంజీవరెడ్డి నూకల కొండయ్యలతో  కలిసి 1937 లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 1938 లో DCC  సభ్యులు అయ్యారు.

స్తబ్దత : 

కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పుడే 1939లో రమణ మహర్షి బోధనలకు ఆకర్షితమై, రాజకీయాలకు దూరంగా జరిగి స్తబ్దత

పాటించాడు. " చైతన్యవంతుల  స్త బ్దత పోరాటాలకు  విఘాతం " అని సూచిస్తూ ....స్తబ్దతను వీడి స్వాతంత్ర సమరంలో పోరాడాల్సిందేనని, స్వాతంత్ర సమరయోధుడు టేకూరు సుబ్బారావు   చేసిన అభ్యర్థన మేరకు 1940 లో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 

1941 లో గాంధీజీ  పిలుపు మేరకు  మద్రాస్ లో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని 4 నెలల జైలు శిక్ష అనుభవించారు.

 భారత కమ్యూనిస్ట్ పార్టీలో :

1945  నాటికి సామాజికంగా రాజకీయంగా మార్పులు చోటుచేసుకున్నాయి. అటు భారతదేశ స్వాతంత్రం కోసం,  ఇటు తెలంగాణ ప్రాంతంలో విముక్తి కోసం పోరాటాలు ఉదృతమయ్యాయి.  ఈశ్వర్ రెడ్డి వామపక్ష భావజాలం వైపు ఉత్తేజిత అయ్యాడు. 1945 లో  పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు.

కడప లోక్‌సభ నియోజకవర్గం  నుండి భారత కమ్యూనిస్టు పార్టీ తరపున నాలుగు సార్లు ఎన్నికయ్యారు. 

మొదటి లోక్ సభ - 1952-57 

మూడవ లోక్ సభ  - 1962-67

నాల్గవ లోక్ సభ, 1967-71

ఐదవ లోక్ సభ 1971-77 

ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గా 1958-62 వరకు  కొనసాగాడు.

 //ప్రజోద్యమాలు - నిర్భందాలు //

హరిజన, గిరిజన ప్రజలకోసం, కార్మికుల హక్కులకోసం, రైతుల కోసం  జీవితకాల పోరాటాలు పోరాటాలు చేశాడు.

కడప జిల్లాలో ఆకాశవాణి కేంద్రం, మైలవరం రిజర్వాయర్‌, యర్రగుంట్లలో  సిమెంట్‌ కర్మాగారం స్థాపనకై  అవిశ్రాంత కృషిచేసి విజయం  సాధించాడు.

1947 లో తన సొంత గ్రామం పెద్దపసపులలో  ద్వితీయ రైతు మహాసభలు పెద్ద ఎత్తున నిర్వహించాడు. ఇది అప్పట్లో సంచలనంగా మారింది.

1964లో  మూడవ  పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్న సమయంలో   ప్రభుత్వం భూ ఆదాయం పెంపుదలకు వ్యతిరేకంగా

" కిసాన్ సత్యాగ్రహం " చేపట్టాడు . ఇందుకు అరెస్ట్ కాబడి మూడు వారాల జైలు శిక్ష అనుభవించాడు.

 1970లో నాల్గవ పార్లమెంటు సభ్యుడుగా ఉన్నప్పుడు  పేద ప్రజల కోసం  అటవీ బంజరు భూమి ఆక్రమణకు సంబంధించి అరెస్టు కాబడి జైలు శిక్ష అనుభవించాడు.

// రాజకీయ శిక్షణా తరగతులు- రహస్య జీవితం //

కడప  జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలలో భాగంగా.... పంజం నరసింహారెడ్డి,పొన్నతోట వెంకటరెడ్డి, 

సంగమేశ్వరరెడ్డి, కె.వి. నాగిరెడ్డి,  వరదారెడ్డి,  గజ్జెల మల్లారెడ్డిలతో కలిసి ఈశ్వరరెడ్డి రాజకీయ శిక్షణా శిబిరాలను నిర్వహించాడు. ఈ క్రమంలో  ఆనాటి జాతీయోద్యమ పరిస్థితుల్లో, తెలంగాణ సాయుధ పోరాట ఉద్ధృతిలో ఉధృతిలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధాలు  కొనసాగాయి.  ఈశ్వర్ రెడ్డి   రహస్య జీవితాన్ని గడిపాడు.

 1949 సెప్టెంబర్ 27 లో అప్పటి మద్రాస్ ప్రభుత్వం ఆంధ్ర కమ్యూనిస్టులపై నిషేధం విధించింది.  ఈశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తెలిసిన గ్రామస్తులు పోలీసులపై తిరగబడ్డారు. పరిస్థితి చేయిదాటింది. తిరగబడ్డ ప్రజలపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో లక్కిరెడ్డి కొండారెడ్డి అనే గ్రామస్తులు మరణించాడు.  ఈ సంఘటన ఆధారంగా  ప్రజా బంధువుగా  ప్రజల గుండెల్లో  ఈశ్వర్ రెడ్డి అర్థం చేసుకోవచ్చు.

//పార్టీలకు అతీతంగా అభిమానులు //

రాజకీయంగా తాను కొనసాగిన పార్టీ ఏదైనాప్పటికీ నిజాయితీతో కూడిన  ఆదర్శ భావజాలం  అతడి  ప్రత్యేకత.పేద, బడుగు  బలహీన వర్గాల  అభ్యున్నతి కోసం నిష్కలంకమైన సేవల్ని అందించాడు. తన  సొంత ఆస్తిని   పేద ప్రజలకోసం ధారపోసాడు.

కడప జిల్లాలో ఒకప్పుడు సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితుల్లో  ప్రజలుకు ఏ కష్టం వచ్చినా ఆదుకునే పెద్దదిక్కుగా  , నాయకులకు ఏ సలహా కావలసి వచ్చినా  సమర్థవంతంగా సూచించే   రాజకీయ కోవిదుడుగా ఈశ్వర్ రెడ్డి ప్రస్థానం తిరుగులేనిది. కాబట్టే పార్టీలకతీతంగా  కార్యకర్తల దగ్గర నుండి నాయకుల వరకు ఈశ్వర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని ప్రేమించారు ప్రేమిస్తూనే ఉన్నారు.

 //గండికోట ప్రాజెక్ట్ కి ఈశ్వర్ రెడ్డి పేరు //

కాంగ్రెస్ పార్టీ చెందిన  అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు,

 ఈశ్వర్ రెడ్డి గారి మీద అభిమానంతోనూ, తమ కడప జిల్లా మొదటి పార్లమెంట్ సభ్యుడిగా సగౌరవంతోనూ,కమ్యూనిష్టు నేతల అభ్యర్థనను మన్నించి గండికోట ప్రాజెక్టుకు ఎద్దుల ఈశ్వర్ రెడ్డి ప్రాజెక్టుగా నామకరణం చేయడం  రాజశేఖర రెడ్డి తండ్రి వైఎస్‌ రాజారెడ్డి ఒకప్పుడు కమ్యూనిష్టు సానుభూతి పరుడు. ఈ క్రమంలో ఎద్దుల ఈశ్వరరెడ్డి గారికి, రాజారెడ్డి గారికి సత్సంబంధాలు  ఉండేవి .

// సాహిత్యాభిలాషి //

సాహిత్యం అంటే వీరికు మొదటి నుండి మక్కువ. ఈ అభిరుచిని తన చివరి దశ వరకు వదులుకోలేదు. పుస్తకాల్ని సేకరించడం చదవడం   నిరంతర చైతన్య స్రవంతిగా కొనసాగించాడు .  ఈ క్రమంలోనే ఇండో-సోవియట్ కల్చరల్ సొసైటీ కి జీవితకాల సభ్యుడుగా కొనసాగాడు.

సాహిత్య, కళారంగాలకు సంబంధించి ఈశ్వర్ రెడ్డి గారు  కడప  ప్రాంతానికి చెందిన  _గజ్జెల మల్లారెడ్డి,

 రా.రా గా ప్రసిద్ధి చెందిన రాచమల్లు రామచంద్రారెడ్డి ,  వై.సి.వి. రెడ్డి గా సుప్రసిద్ధులైన  యమ్మనూరు  చిన వెంకటరెడ్డి ,ఆర్వీయార్‌ ప్రసిద్ధులైన రాళ్లబండి వేంకటేశ్వరరావు, కేతు విశ్వనాథ రెడ్డి,   సొదుం సోదరులు [సొదుం జయరాం సొదుం రాంమ్మోహన్] "  తదితరులను  చాలా ప్రొత్సహించినట్టు కేతు విశ్వనాథరెడ్డి గారు స్వయంగా చెప్పుకున్నారు . సాహితీ  మహా పండితుడు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఈశ్వరరెడ్డిని గారిని ‘అన్నా’ అని సంబోధించే వారంటారు. 

 //కుటుంబం //

సామాజిక కార్యకలాపాలు కొనసాగిస్తూ    రైతులు రైతులు కూలీల కోసం, వారి హక్కుల కోసం  క్రియాశీలకంగా  చేసిన ఈశ్వర్ రెడ్డి  అవివాహితుడు.

తన ఆస్తులన్నింటిని  ఉద్యమాల కోసం, పార్టీ కోసం, ప్రజల కోసం ధారపోసాడు . కమ్యూనిష్టు పార్టీ ఆఫీసు ‘హోచిమిన్‌భవన్‌’ లో తన  చివరి రోజులను గడిపాడు.

//కాలధర్మం //

 తన 71వ ఏట 1986 ఆగస్టు 3న కడపలో పార్టీ కార్యాలయంలో  మరణించాడు.

// విగ్రహం ఏర్పాటు//

2008 లో కడప జిల్లా జమ్మలమడుగు  సబ్‌జైలు వద్ద ఎద్దుల ఈశ్వరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

 కొన్ని సామాజిక రాజకీయ పరిస్థితుల్లో  2021లో ఆ  ఆ విగ్రహాన్ని  అక్కడి నుండి తొలగించి  పాత బస్టాండు వద్ద పునః ప్రతిష్ఠించారు.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.