pm internship: Center's new scheme.. Monthly Rs. 5000.. This is the last date
PM Internship: కేంద్రం కొత్త స్కీమ్.. యువతకు నెలనెలా రూ. 5000.. లాస్ట్ డేట్ ఇదే.
PM Internship Scheme 2025: ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం.. ఏప్రిల్ 22, 2025 వరకు పొడిగించింది. 21-24 ఏళ్ల మధ్య వయసున్న అర్హులైన యువతకు ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం లభిస్తుంది. వారికి స్టైపెండ్తో పాటు ప్రోత్సాహకం కూడా అందజేస్తారు. దరఖాస్తు కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
PMIS Stipend: యువతలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి, వారికి కార్పొరేట్ ప్రపంచంపై అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ పథకం (పీఎంఐఎస్) దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది. తొలుత ఏప్రిల్ 15గా నిర్ణయించిన తుది గడువును యువత నుంచి వస్తున్న అభ్యర్థనల మేరకు ఏప్రిల్ 22, 2025 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన భారతీయ పౌరులందరికీ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా, పూర్తికాలిక ఉద్యోగాలలో నిమగ్నమై ఉండని లేదా రెగ్యులర్ కాలేజీలకు హాజరుకాని యువత (అయితే గుర్తింపు పొందిన ఆన్లైన్, దూరవిద్య కోర్సులు చదువుతున్న వారు కూడా అర్హులే) ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 యూనియన్ బడ్జెట్లో ఈ పథకంపై ప్రకటన చేశారు.
దరఖాస్తుదారులకు కనీసం పదో తరగతి లేదా దానికి సమానమైన విద్యార్హత ఉండాలి. కొన్ని ప్రత్యేక సాంకేతిక నైపుణ్యాలు లేదా నిర్దిష్ట రంగాల్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యం ఉంటుంది. ఈ పథకం ద్వారా ఎంపికైన అభ్యర్థులకు భారతదేశంలోని అత్యుత్తమ 500 కంపెనీలలో పూర్తి 12 నెలల పాటు ఇంటర్న్షిప్ చేసే అద్భుతమైన అవకాశం లభిస్తుంది.
ఈ ఇంటర్న్షిప్ సమయంలో, వారికి ప్రతి నెలా రూ. 5,000 స్టైపెండ్గా అందజేస్తారు. ఇందులో, ఇంటర్న్ హాజరు, పనితీరు, ప్రవర్తన ఆధారంగా యజమాని నేరుగా నెలకు రూ. 500 చెల్లిస్తారు. యజమాని ఈ చెల్లింపును ప్రాసెస్ చేసిన తర్వాత, భారత ప్రభుత్వం మిగిలిన రూ. 4,500ను నేరుగా ఇంటర్న్ ఆధార్-లింక్డ్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తుంది. ఇలా ఏటా రూ. 60 వేలు వారి చేతికి వస్తాయి. అంతేకాకుండా, పథకం ప్రారంభంలో వారిని ప్రోత్సహించడానికి ఒకేసారి రూ. 6,000 ప్రత్యేక ప్రోత్సాహక నిధిని కూడా అందిస్తారు. ఈ ఆర్థిక సహాయం యువతకు మరింత ఉత్సాహాన్నిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
పీఎంఐఎస్ పథకంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ (www.pminternship.mc.gov.in) ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. తద్వారా ఎక్కువ మంది యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. గడువు దగ్గరపడుతున్నందున, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఇంటర్న్షిప్ యువతకు వారి కెరీర్కు ఒక బలమైన పునాది వేయడానికి, కార్పొరేట్ రంగంలోని పని విధానాలను దగ్గరగా తెలుసుకోవడానికి ఒక అమూల్యమైన వేదికగా ఉపయోగపడుతుంది.