Legislature Passes 'Bhu Bharati' Bill - Contents
Telangana Bhu Bharati : 'భూ భారతి' బిల్లుకు శాసనసభ ఆమోదం - ఇందులోని అంశాలివే
Telangana Bhu Bharati Bill 2024 : ‘తెలంగాణ భూ భారతి - 2024 బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు ఉన్న ధరణి స్థానంలో… ఇకపై భూ భారతి రానుంది. కొత్త చట్టంలో కీలక అంశాలు ఉన్నాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. అర్వోఆర్-2020ను కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తూ… కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఇకపై రాష్ట్రంలో ధరణి స్థానంలో కొత్తగా భూ భారతి చట్టం అమల్లోకి రానుంది.
కీలక అంశాలు…
ప్రస్తుతం ఉన్న ధరణి రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. కొత్త చట్టం కింద రికార్డులను నమోదు చేస్తారు. గతంలో రద్దు చేసిన అనుభవదారుడి కాలమ్ ను మళ్లీ తీసుకురానున్నారు. అనుభవదారుడికి ఈ చట్టం రక్షణగా నిలువనుంది. దీంతో చాలా మంది రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
తప్పులను సవరణతో పాటు పాస్ పుసక్తాలు రాని వాళ్ల సమస్యలను సత్వరమే పరిష్కరించనున్నారు. ఇందుకోసం తహశీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు అధికారం ఉండనుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెనువెంటనే మ్యుటేషన్ జరిగి పాస్ పుస్తకం వస్తుంది.
కొత్త చట్టం ప్రకారం మ్యుటేషన్కు మ్యాప్ తప్పనిసరిగా ఉంటుంది. వారసత్వ భూముల విషయంలో తప్పులు జరగకుండా చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయి విచారణ తర్వాతే… ప్రక్రియ ముందుకు సాగుతుంది. నిర్ణీత కాలంలో విచారణ చేసిన తర్వాతనే పాస్ పుస్తకాలు జారీ అవుతాయి.
చాలా ఏళ్లుగా 38E, ఓఆర్సీ, లావణి పట్టా వంటి భూముల సమస్యలు ఉన్నాయి. వీటికి పాస్ పుసక్తాలు కూడా లేవు. అయితే కొత్త చట్టం ప్రకారం పాస్ బుక్ లు జారీ అవుతాయి. ఆర్డీవో ద్వారా ఇచ్చే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. అంతేకాకుండా… గ్రామకంఠం, ఆబాదీలపై కూడా హక్కులు దక్కనున్నాయి. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో రెండెంచెల అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు కానుంది.
భూ-భారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా భూముల వివరాలను చూసుకునేలా డిస్ప్లే చేస్తారు. గతంలో ఉన్న 33 మూడ్యూళ్లు కాకుండా.. ఆరు మాడ్యూళ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రతి భూకమతానికి భూ ఆధార్ ఉండనుంది. హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటారు. 2014 జూన్ 2 ముందుకు జరిగిన సాదా బైనామాలను కూడా క్రమబద్ధీకరించనున్నారు. భూ సమస్యలు ఉన్న రైతులకు ఉచితంగా న్యాయ సలహాలు ఇచ్చేలా కొత్త చట్టంలో రూపకల్పన చేశారు.
ఈ బిల్లుపై మాట్లాడిన బీజేపీ, ఎంఐఎం, సీపీఐ.. పలు సవరణను సూచించింది. దీనిపై కూడా చర్చించి… మార్పులపై ప్రకటన చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభలో చెప్పారు.