Group 2 and Group 3 : గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాల్లో సంచలన మార్పులు.. అభ్యర్థులకు కీలక సూచన
Group 2 and Group 3 : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మరో నిబంధనను అమల్లోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుంది. దీనికి తోడు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ సర్టిఫికెట్(సీపీటీ) ను తప్పనిసరి చేశారు. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ సర్వీసుల కార్యదర్శి పోలా భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగ నియామకాల నిబంధనల్లో సవరించిన మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని సాధారణ పరిపాలన విభాగం పేర్కొంది. ఏపీపీఎస్సీ లేదా ఏపీ సాంకేతిక విద్యాబోర్డు నిర్వహించే సీపీటీ పాస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఇది లేకపోతే నియామకానికి అనర్హులని అడ్ హాక్ నిబంధనల్లో పేర్కొన్నారు.
సీపీటి పరీక్ష 100 మార్కులకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు, వివిధ రకాల ఆపరేటింగ్ సిస్టమ్ లు, ఇంటర్నెట్ అంశాల్లో పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని వెల్లడించారు. గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాలకు ఈ తాత్కాలిక నిబంధన వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బీసీలు 35, ఓసీలు 40 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు కనీసం 30 మార్కులు సాధిస్తే సరిపోతుందని వివరించారు. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా నియమితులయ్యే వారంతా సీపీటీ పాస్ కావాల్సిందేనని పేర్కొన్నారు.