Tractors, drones with subsidy
రైతులకు రేవంత్ సర్కారు మరో శుభవార్త.. సబ్సిడీతో ట్రాక్టర్లు, డ్రోన్లు.
వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు ఎద్దులు, దున్నల సాయంతో దుక్కి దున్ని చదునుచేసేవారు. ప్రస్తుతం మాత్రం వాటి స్థానంలో ట్రాక్టర్లు వచ్చి చేరాయి. అలాగే, ఆధునిక సాంకేతికతను వ్యవసాయానికి జోడిస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్ల సాయంతో రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. వ్యవసాయ యాంత్రీకరణపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. రైతులకు ఉపయోగపడే 20 రకాల సాగు సామాగ్రిని అందజేయనుంది. వీటికి కొంత మొత్తం సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇవ్వనుంది.
వ్యవసాయంలో యాంత్రీకరణపై దృష్టిపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. రైతులకు సబ్సిడీ కింద అవసరమైన పనిముట్లను అందజేయాలని నిర్ణయించింది. ట్రాక్టర్లు, కల్టివేటర్లు, పురుగు మందులు పిచికారీకి డ్రోన్లు, పవర్ స్పేయర్లు సహా సాగులో ఉపయోగపడే 20 పరికరాలను ఇవ్వనుంది. ఈ పరికరాలు సరఫరా చేసే కంపెనీలతో ఒప్పందం కోసం వ్యవసాయ శాఖ టెండర్లు ఆహ్వానించింది. ఇందుకు గడువు ఫిబ్రవరి 7గా నిర్ణయించింది. ఆయా సంస్థలు దాఖలు చేసిన బిడ్లను ఫిబ్రవరి 8న తెరిచి.. తక్కువ కోట్ చేసిన వాటిని ఎంపిక చేయనున్నారు.
ఇక, సబ్సిడీ కింద ఇచ్చే యంత్ర పరికరాల కోసం రూ.50- రూ.60 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా వేసింది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఇది అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో యాంత్రీకరణ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. సబ్సిడీ కింద రైతులకు అందజేయనున్న వ్యవసాయ పరికరాలలో 600 ట్రాక్టర్లు, 160 వరకు డ్రోన్లు ఉన్నాయి. దుక్కి కోసం ట్రాక్టర్లకు కల్టివేటర్, ప్లవ్, రోటవేటర్లు సహా అమర్చే వివిధ పరికరాలనూ అందజేయనుంది.
ఇక, టెండర్లలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 12వేల యూనిట్ల రోటావేటర్లు, 4వేల యూనిట్ల కల్టివేటర్లు, 2వేల యూనిట్ల ప్లవ్, 200 యూనిట్ల గడ్డికట్టే యంత్రాలు, భూమిపై గడ్డిని తొలగించే బ్రష్ కట్టర్లు 400, పొలం గట్లు వేసే బండ్ ఫోర్మర్లు 64, మొక్కల మధ్య ఉన్న కలుపు, గడ్డి తొలగించేందుకు 200 పవర్ వీడర్స్ అందివ్వనున్నారు. వీటితో పాటు మొక్కజొన్న కంకుల నుంచి గింజలుగా వేరుచేసే 80 యంత్రాలు, 420 వరకు పవర్ ట్రిల్లర్లు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే, 16-20 లీటర్ల ట్యాంకుల సామర్ధ్యంతో ఉన్న పవర్ స్ప్రేయర్లు 12వేలు, 12-16 లీటర్ల స్ప్రేయర్లు 6,300, డీజిల్, కరెంటుతో నడిచే 1,,230 యూనిట్ల పంప్సెట్లు, నీటిని సరఫరా చేసే పీవీసీ, హెచ్డీపీఈ పైపులు 1,40,000, స్టోరేజీ బిన్స్ 50వరకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.